తెలుగు బుల్లితెరను ఏలుతున్న పరభాషా తారలు!
on Aug 4, 2021
తెలుగు టీవీ ఇండస్ట్రీ ప్రాంతంతో, భాషతో సంబంధం లేకుండా టాలెంట్ను ప్రోత్సహించడంలో ముందుంటోంది. తెలుగువాళ్ల కంటే బయటివాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారంటూ స్థానిక కళాకారులు విమర్శలు చేస్తున్నా, అప్పుడప్పుడు ఆందోళనలు చేస్తున్నా, ప్రేక్షకులు మాత్రం తెలుగువారు, పరాయివారు అనే తేడా లేకుండా ప్రతిభావంతులైన తారలను ఆదరిస్తున్నారు. అలా తెలుగు వీక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్న తెలుగేతర తారలెవరో చూద్దాం..
ప్రేమి విశ్వనాథ్
పరభాషా తారల్లో తెలుగువారి హృదయాల్లో అందరికంటే అధికంగా స్థానం సంపాదించుకుంది ప్రేమి విశ్వనాథ్. డీగ్లామర్డ్ ఫేస్తోటే ఆమె వారి అభిమానాన్ని పొందిందంటే.. అందుకు కారణం ఆమె నటనా ప్రతిభే. కార్తీకదీపం సీరియల్లో దీప అలియాస్ వంటలక్క పాత్రలో బ్రహ్మాండంగా రాణిస్తోన్న ప్రేమి మలయాళం అమ్మాయి. కార్తీకదీపం ఒరిజినల్ మలయాళం సీరియలే. అందులో కరుత్తముత్తుగా ఆకట్టుకున్న ఆమె అదే పాత్రను తెలుగులో పోషిస్తోంది. ఇవాళ తెలుగమ్మాయి మాదిరిగానే చక్కని తెలుగు మాట్లాడుతోంది ప్రేమి.
ప్రియాంక జైన్
మౌనరాగం సీరియల్లో మూగమ్మాయి అమ్ములు పాత్రతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది ప్రియాంక జైన్. బెంగళూరుకు చెందిన ఆమె, ఈ సీరియల్ తమిళ రీమేక్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్లో జానకి రోల్లో అలరిస్తోన్న ప్రియాంకకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అందమైన తన ఫొటోలతో పాటు ఫన్ వీడియోస్ను షేర్ చేస్తూ ఫ్యాన్స్కు ఆనందం కలిగిస్తోంది.
తనూజా గౌడ
ముద్ద మందారం సీరియల్లో పార్వతి పాత్రతో తెలుగువారిని ఆకట్టుకున్న బెంగళూరు అమ్మాయి తనూజా గౌడ. ముద్ద మందారం, అందాల రాక్షసి సీరియల్స్లో ప్రదర్శించిన అభినయంతో స్వల్ప కాలంలోనే వీక్షకుల అభిమాన తారగా మారిందామె. ఆరేళ్ల పాటు తమను అలరించిన ముద్ద మందారం సీరియల్ ముగిశాక ఆమె ఏ సీరియల్తో మళ్లీ తమ ముందుకు వస్తుందా అని వీక్షకులు ఎదురుచూస్తున్నారు.
మేఘనా లోకేశ్
కర్ణాటకకు చెందిన మరో ముద్దుగుమ్మ మేఘనా లోకేశ్. తెలుగు బుల్లితెరపై శశిరేఖా పరిణయం సీరియల్లో టీనేజ్లోనే అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన అందచందాలు, అభినయ సామర్థ్యంతో తెలుగువారి హృదయాలను దోచుకుంది. కల్యాణ వైభోగం, రక్త సంబంధం సీరియల్స్ ఆమె అభిమానుల సంఖ్యను పెంచాయి.
కావ్యశ్రీ
గోరింటాకు సీరియల్లో శ్రీవల్లి పాత్రలో ప్రదర్శించిన అభినయంతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది కావ్యశ్రీ. సూపర్హిట్ తెలుగు సీరియల్స్లో గోరింటాకు ఒకటి కావడంతో ఆమెకు పాపులారిటీ లభించింది. కర్ణాటకకు చెందిన ఆమె ఇవాళ పాపులర్ టీవీ తారల్లో ఒకరు.
శోభాశెట్టి
కార్తీకదీపం సీరియల్లో పోషిస్తోన్న వ్యాంప్ టైప్ క్యారెక్టర్ మోనితను చూసి తిట్టుకోని వారుండరు. ఆ నెగటివ్ రోల్తోటే పాపులర్ అయిన తార శోభాశెట్టి. ఆ క్యారెక్టర్ను ఆమె పోషిస్తున్న తీరు, ఆమె విగరస్ లుక్స్ శోభకు పాపులారిటీ తీసుకొచ్చాయి. లాహిరి లాహిరి లాహిరిలో సీరియల్లోనూ కీలకపాత్ర చేసిన శోభ బెంగళూరు అమ్మాయి.
అర్చనా అనంత్
కార్తీకదీపం సీరియల్లో పాపులర్ అయిన మరో పరభాషా నటి అర్చనా అనంత్. డాక్టర్ బాబుకు తల్లి పాత్రలో అందమైన అమ్మ సౌందర్య పాత్రలో సూపర్బ్గా రాణిస్తోన్న ఆమె కూడా బెంగళూరు నుంచే వచ్చింది. ఈ సీరియల్ కన్నడ రీమేక్లోనూ ఆమె ఇదే పాత్ర చేయడం గమనార్హం. తన వయసుకు మించిన పాత్రను చేస్తూ తెలుగువారి హృదయాలను ఆకట్టుకున్న ఆమె కొద్దిరోజులుగా కార్తీకదీపంలో కనిపించకపోవడంతో అభిమానులు ఏమైందోనని ఆరా తీస్తున్నారు. వెన్నుకు సంబంధించిన సమస్యతో బాధపడిన ఆమె త్వరలో షూటింగ్ను కొనసాగించనున్నది.
Also Read